బడి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బడి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2023, శుక్రవారం

పరీక్షల్లో ఎదురైన విచిత్రమైన అనుభవం

ఈ  రెండూ  మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన ఏడవ తరగతిలో జరిగింది. మాది ప్రయివేటు బడి కావడంతో ఒక ప్రభుత్వ బడిలో కేంద్రం ఇచ్చారు.

అప్పటికి జంబ్లింగ్ పధ్ధతి లేదు. అందుకని అన్ని పరీక్షలు ఒకే గది , ఒకే బల్లపై  వ్రాసాను. ఇన్విజిలేటరు కూడా దాదాపు ఒక్కరే వచ్చారు (ఇది ముఖ్యం).

**** 1 ****
ఇక మొదటి అనుభవం  సైన్సు పరీక్ష  రోజు జరిగింది. అప్పట్లో మెయిన్ పేపర్ 2 గంటలు. ఆఖరి 30 నిముషాలు ఉందనగా బిట్ పేపర్ ఇచ్చేవారు. నేను ఎప్పటిలాగానే గంటన్నరలో ఛాయిస్  ప్రశ్నలతో సహా వ్రాసేసి, అలంకారాలు (హెడింగ్ అండర్లైన్లు  వగైరా) చేసేసి గోళ్లు గిల్లుకుంటున్నా.  ఇన్విజిలేటరు  సారు వచ్చారు.

"ఏరా ! అన్ని రాసేసేవా? గోళ్లు గిల్లుకుంటున్నావ్" (ఆయన నాలుగు రోజులనుండి నన్ను చూస్తున్నాడు కావున, తెలుసు నేను బాగా రాస్తున్నానని)

"అవునా సార్!"

"ఏదీ  చూపీ " అని పేపర్లు తీసుకున్నారు. ఆయనకి నేను గీసిన మూత్రపిండాలు (కిడ్నీ) బొమ్మ బాగా నచ్చింది.  వెంటనే ఆ ఒక్క పేపరు తీసుకుని వెనక వరుసల్లో ఎవరో విద్యార్థికి ఇచ్చేశాడు చూచి గీసుకోమని. బహుశా ఆయనకి తెలిసినవాడు అనుకుంటా .  ఎం చేస్తాం బిక్క మొహం వేయటం మినహా .

నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాకేమో 12 ఏళ్ళు, అవి మొదటి పబ్లిక్ పరీక్షలు.

బిట్ పేపర్ గంటకి ఇంకా 10 నిముషాలు ఉందనగా, నా  పేపరుతోపాటు  వాడి ఆన్సర్ షీట్  తెచ్చారు. "వాడికి గీయడం  రావడంలేదుగానీ  నువ్వే గీసిచ్చేయ్" అన్నారు.

ఇది లోకంతో , వ్యవస్థతో మొదటి పరిచయం :)

*** 2 ***
ఇది ఇప్పుడు చూసుకుంటే పెద్ద విచిత్రం కాదుగానీ , అప్పుడుం మా పన్నెండేళ్ల  వయసుకి పెద్ద వింత.

తరువాతి పరీక్ష సోషల్ ఇక ఆ రోజు అన్నాక పేపరు లీకయింది.  అదే ఆ తరువాత 3-4 ఏళ్ళు  వరుస లీకులకి ప్రారంభం. నాకేమో సోషల్ కష్టమైన సబ్జెక్టు  - మ్యాథ్స్-సైన్స్ కుమ్మేవాడినిగానీ.

ఏప్రిల్లో అయిపోవాల్సిన పరీక్ష, మేము ఉగాది-శ్రీరామనవమి గడిపాక, 2-3 గాలి దుమారాలు, ఎండాకాలం  క్రికెట్లు అయ్యాక మేలో పెట్టారు.  ఈ  శ్రీరామనవమికి నాకు, నా  బెస్ట్ ఫ్రెండ్కి ఒక గొడవ. వీటన్నింటితో చదువు అటకెక్కి, ఆ ఒక్క పరీక్షకి వెళ్లడం కొత్తయినది. అదే 'వింత' అనుభవం .  బెస్టు ఫ్రెండుతో గొడవ పెట్టుకునందుకో ఏమో  నాకు మొదటిసారి ఒక పరీక్షలో 60 కన్నా తక్కువ వచ్చాయి.

ఆ శ్రీరామనవమి గొడవ ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ - https://jb-jeevanayanam.blogspot.com/2011/04/blog-post.html

1, అక్టోబర్ 2020, గురువారం

నా పదవ తరగతి పరీక్షలు - గ్రూపిజం

 పరీక్ష గురించి చెప్పేముందు మా స్కూల్ గురించి కొంచెం చెప్పాలి పదవ తరగతి క్లాస్ లో మేము ఐదుగురు మాత్రమే మా స్కూల్ స్టూడెంట్స్ మొత్తం 100-120 నే. మా అన్నయ్య చదివినప్పుడు అయితే వాళ్లు ఇద్దరు మాత్రమే క్లాసులో.

ఈ ఐదుగురిలో తమిళనాడు నుంచి వచ్చిన కవలలైన ఒక అన్న , చెల్లి. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ అంజి. ఇక ఐదవ మెంబరు మా నాన్నగారి సంగీతం గురువుగారి చెల్లెలు.

తొమ్మిదవ తరగతిలో జరిగిన ఒక సంఘటన వలన ఏడాది చివరి మార్చిలో మా ప్రిన్సిపాల్ని తీసేశారుఒక ఇబ్బందికర జ్ఞాపకం. ఆయన మాకు మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పేవారు. అప్పటికే ఆయనతో గొడవ పడి అన్నాచెల్లెళ్ళు ఒక సారు దగ్గర ట్యూషను చేరారు. అలా ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోవడంతో మా పాత మేడమ్ ఒకరు ప్రిన్సిపాలుగా వచ్చారు. నేను, అంజి సొంతంగా చదువుకొని పరీక్షలు వ్రాశాం.

పదవ తరగతికి వచ్చేసరికి వాళ్ళ ట్యూషన్ సారుని మాకు సైన్సు టీచరుగా తెచ్చారు. ఆయన, ఆయన తీసుకొచ్చిన మ్యాథ్సు సారు వారిపై పక్షపాతం చూపించేవారు. ఇంగ్లీషు, సోషల్ చెప్పే ప్రిన్సిపాలు పాత విద్యార్థులమని మాపై పక్షపాతం చూపిస్తుందని ఆ అన్నాచెల్లెళ్ళ ఆరోపణ.

ఉన్న ఐదుగురిలో ఎప్పుడూ నాకే మొదటి ర్యాంకు వచ్చేది. ఆ అన్న, చెల్లి కూడ బాగా చదివేవారు కానీ, వారు మ్యాథ్సులో వీకు. నాకు ఎప్పుడూ నూటికి నూరు వస్తాయి, దానితో కవరు చేసేవాడిని. వారు చాలా కాంపిటీటివ్గా ఉండేవారు. మొదటి ర్యాంకు కొట్టాలని ఎనిమిదవ తరగతి నుంచి తెగ ప్రయత్నించేవారు. వారి సారు వచ్చాక కూడా నేనే నెగ్గుకొస్తుండేసరికి కొంచెం రోషపడుతుండేవారు. టీచరు పేపర్లు దిద్దేటపుడు, మార్కులు ఇచ్చేటపుడు చూడాలి - అడ్డంగా నించునేవారు. అంజినేమో టీచరు చేయి తిప్పేదానిబట్టి గెస్ చేసి చెప్పి వారిని ఉడికించేవాడు.

ఇక ఫిబ్రవరి వచ్చి, సిలబస్ పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళు ముగ్గురూ మళ్ళీ గొడవ పెట్టుకొని స్కూలుకి రావడం మానేశారు. నేను, అంజి మటుకు చివరి దాక వెళ్ళి రివిజను చేశాం.


ఇక అసలు పరీక్షలు మొదలయ్యాయి. మేమిద్దరం అర కిలోమీటరు నడిచి వెళ్ళి, సిటీబస్ ఎక్కి పది నిమిషాలు ప్రయాణించి సెంటరుకి వెళ్ళాం. రోజూ అలా సొంతంగానే వెళ్లేవారం. ఈ రోజుల్లో ఇంటరు-ఇంజనీరుంగు పరీక్షలకీ, ఉన్న ఊళ్ళో మొదటి రోజు ఉద్యోగం చేరడానికీ ఫ్యామిలీ మొత్తం వచ్చి దింపడం చూస్తుంటే నవ్వొస్తుంది.

సరే అక్కడ వారు ముగ్గురూ కనిపించారుగానీ మాతో మాట్లాడలేదు. రెండవ రోజు తెలిసిందీ,ఆ అన్నాచెల్లెళ్ళకీ - నెంబర్ 5కి కూడ గొడవ అయ్యిందని.

అలా ఉన్న ఐదుగురం మూడు వర్గాలు అయ్యామన్నమాట.

ఇంగ్లీషు పరీక్షకి, గ్రామరు కోసం ఆ నెంబర్ 5 మాతో పూర్తిగా మాట కలిపింది. చెప్పాను కదండీ, అన్నాచెల్లెళ్ళు మ్యాథ్సులో వీకు అని - మ్యాథ్సు పరీక్షకి మాట కలిపారు.

అలా చివరికి అందరం కలిసిపోయాం.


పరీక్షలు ఎలా రాశామంటే - నాకు గుర్తున్నంతవరకు పరీక్షా సమయం ఉ|| 10.00 – 1.00 మ|| వరకు. ఆరింటికి లేచి, ఒక గంట పుస్తకాలు తిప్పేవాడిని. 9 కల్లా బయలుదేరి, సెంటరుకి వెళ్ళేవారం. పరీక్షయ్యాక ఇంటికొచ్చి, అన్నం తిని నిద్రపోయేవాడిని. 4కి లేచి, అంజివాళ్ళింటికి పొయ్యేవాడిని. క్రికెట్ ఆడి చీకటి పడ్డాక ఇంటికొచ్చేవాడిని. 7–7.30 కి పుస్తకాలు తీసేవాడిని. ఒక 9–9.30 దాక చదివి, అన్నం తిని నిద్రపోయేవాడిని. మళ్ళీ ఉ|| 6కే లేవడం. అతిసయోక్తి అనుకోపొతే నేనేప్పుడూ తెల్లవారి లేచి చదవలేదు. ఇంజనీరింగులోనూ, కొన్ని (5–6) ఫైనల్ పరీక్షలకి మటుకు రాత్రి 11.30 వరకు చదివాను, పొద్దునే 7.30కి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళి వ్రాయాలి కాబట్టి.


అలా ఆడుతూ పాడుతూ వ్రాసిన నాకు 488/600 (81.3%) వచ్చాయి. మ్యాథ్సులో 98 వచ్చాయి. హిందీలో 50 చిల్లర వచ్చాయి. ఆ రోజుల్లో (1990లు) పదిలో 500 దాటితే తెలివైనవారిగా చూసేవారు. కొంచెం శ్రద్ధ పెట్టుంటే 500 దాటేవిగా అనిపించింది అప్పట్లో.