25, అక్టోబర్ 2010, సోమవారం

సుందోపసుందులు - ౩ : పోస్తానా? పొయ్యనా?

క్రిందటి భాగానికి కొనసాగింపు.

... పెళ్ళయిపోయింది, భోజనాలయిపోయాయి, అంటే వచ్చిన పనయిపోయింది. ఇప్పుడేం చేయాలి ఇంతరాత్రి - వెనక్కి పోవాలా? రాత్రికెక్కడుండాలి? అని ఆలోచించుస్తుంటే చల్లని కబురు చెప్పారు - మర్నాడు పొద్దున నాలుగున్నరకి మొదటి రైలుందీ, అయినా లాడ్జిలో రూము బుక్ చేశాము, హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అన్నారు. వాళ్ళ సంగతి తెలిసిందే అయినా, సరేనని బయలుదేరాం. మాకు వేరే ఛాయిస్ ఏముందిగనక.

మండపంనుండి బయలుదేరి రాత్రి పదకొండుకి ముచ్చట్లు (అదే సొల్లు) చెప్పుకుంటూ లాడ్జికి చేరాం. అక్కడ రెండు గదులు తీసుకున్నారట. ఒక గదిలో మీరు తాగుతారో, ఏం చేసుకుంటారో (వాళ్ళకి వేరే ఆలోచనలుకూడా వున్నట్లు సందేహమొచ్చింది) మీ ఇష్టంఅని, నేనూ, రాం, కిరణ్, ఇంకా శీను ఒకగదిలో దూరాం. గది చాలా దారుణంగా వున్నా, అలసిపోయున్నాంగా వెంటనే నిద్ర పట్టింది. ఇలా పడుకున్నామోలేదో వెంటనే మావాళ్ళు తలుపులుబాదటం మొదలుపెట్టారు. అరే, లాడ్జివాడు ఖాళీ చేయమంటున్నాడు, పదండిరా అని. అర్థమయిందేంటంటే వాళ్ళు పిచ్చగా తాగి గొడవ చేసిందిచాలక ఇంకో వెధవ పనిక్కూడా ప్రయత్నించారని. ఓనర్కి, వీళ్ళకి మాటామాటా పెరిగి, ఇంక ఊళ్ళో లాడ్జీలేలేవా అని మమ్మల్నీ బయటికి లాక్కొచ్చారు మమ్మల్ని ఓనరుతో మాట్లాడనీకుండా.

ఫుల్లుగా తాగి రోడ్డుపై గట్టిగా మాట్లాడుతూ ముందువాళ్ళు, కొంచెం దూరంలో వెనక మేము నలుగురం. ఏం చేస్తాం, వాళ్ళు లోకల్, మేం ఊరికి కొత్త. వాళ్ళు తిప్పే రోడ్లే అర్థంకావట్ల, ఇంక లాడ్జిలెక్కడో ఏం తెలుసు. ప్రతీ లాడ్జీలో లేదు అనిపించుక్మ్టూ (వీళ్ళని చూసి ఎవరిస్తారు), సగం నిద్రతో హూనమైన ఒళ్ళుతో కాళ్ళీడూస్తూ అలా అర్ఠరాత్రి గంటసేపు తాగుడు బ్యాచితో కాకినాడ ఊరేగాక, ’రక్షక్’లో పోలీసుమామలెదురయ్యారు. మావాళ్ళని కొంచెం గమ్మునుండమని, వారికేదో చెప్పి తప్పించుకున్నాం. ఆ దెబ్బకి ఇక నావల్ల కాదు, దీనికన్నా రైల్వేస్టేషను నయం, హాయిగా వెయిటింగురూములో కూర్చోవచ్చు, నేవెళ్తున్నా ఎవరైనా వస్తారా అనడిగా - రాం, కిరణ్, శీను బయలుదేరారు.

అలా ఒంటిగంటకి కాకినాడ స్టేషనుకి వెళ్ళితే అక్కడ అసలు షాకులు.

స్టేషను బాగుచేస్తున్నారంటా, మొత్తం గుంటలూ, గొట్టాలు. మొత్తం చిమ్మచీకటి. కనీసం రిక్షాలు, ఆటోలు కూడా లేవు. ఎలాగో తారాడుకుంటూ, స్టేషను బిల్డింగుకి చేరితే, బుకింగు కౌంటరు తప్ప అన్ని రూములు బందు రిపేర్లకి. ఓవర్ బ్రిడ్జీకి కంచెలు. సిమెంటు బెంచీలు మళ్ళీ కొత్తగా కట్టడంతో పచ్చిపచ్చిగా. ప్లాట్ఫామంతా సిమెంటూ, ఇసక. పట్టాలు దాటి రెండో ప్లాట్ఫాం చివరదాక నడుచుకుంటూ వెళ్ళితే అక్కడ ఒక్క బెంచీ దొరికింది. హమ్మయ్యా అని దానిపై సెటిలయ్యాం. చలీ, దోమలు తట్టుకుంటూ నెమ్మదిగా నిద్రపట్టుతుంది అనుకుంటుండగానే ఒక గూడ్సు రైలు పేద్ద శబ్దంతో పోర్టు స్టేషన్నిండి వచ్చి రెండో ప్లాట్ఫాంపై వచ్చి ఆగింది.

ఇంక మాకు టెన్షను. మరి ఫుట్‌బ్రిడ్జి మూసుందిగా. దానికింద నుండి దూరదాం అంటే అదెప్పుడు బయలుదేరుతుందో తెలీదు. ఇద్దరేమో దాని కింద నుండి దూరారు. నేనూ, శీను ఫుట్‌బ్రిడ్జీ కంచె దూకి పైకెక్కి మళ్ళీ ఇవతలి ప్లాట్ఫాంకి వచ్చాం. ఈ ఫీటులో శీను కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. కిరణ్దగ్గర ఒక దుప్పటి వుందని అప్పుడు గుర్తొస్తే దాన్ని పరిచి ఇద్దరు కూర్చున్నారు. నేను, ఇంకోడూ ప్లాట్ఫాంపై. ఉద్యోగంలో కొచ్చాక మొట్టమొదటిసారి రెండువేలు పెట్టి కొనుక్కున్న పీటర్ ఇంగ్లాండ్ జత - ఒక్కసారే వేసుకున్నా - అలా ప్లాట్ఫాంపై సిమెంటూ-ఇసకలతో. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆజత వేసుకున్నపుడల్లా బాధే.

అలా అర్థరాత్రి చిమ్మచీకటిలో, బ్రాండెడ్ దుస్తులతో మేము నలుగురం ఆ కాకినాడ ప్లాట్ఫాంపై పొర్లుతూ దోమలతో కుస్తీ పడుతూ జోగుతుంటే ప్లాట్ఫాంపై కలకలం మొదలయ్యింది. లేచి చూస్తే మూడున్నరయ్యింది. జనాలు వస్తున్నారు. మేం నెమ్మదిగా లేచి టిక్కెట్లు కొనుక్కొచ్చుకున్నాం. మర్చిపోయా, ఈ మధ్యలో, శీను ఈ బాధ భరించలేక బస్టాండుకి వెళ్ళిపోయాడు, హైదరాబాదుకి ఫస్టు బస్సులో పోతాని.

నాలుగున్నరకి రైలంటే నాలుగిరవైకి చూడాలి, ప్లాట్‌ఫాంపై కాలు పెట్టేచోటు కూడాలేదు. పోర్టు స్టేషన్నుండి రావాల్సిన రైలు ఐదయితేగానీ రాలేదు, మమ్మల్ని గంటసేపు నిల్చోబెడుతూ. ఏదో మాకిరణ్ రన్నింగులో రైలెక్కి సీట్లాపాడు కాబట్టి బతికిపోయాం. ఇక చూస్కోండి విజయవాడకి వచ్చేవరకు లేవకూడదని చెప్పి పడుకున్నాం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే నేను ఒక టపా ఎందుకు రాస్తాను. ఎనిమిదో, ఎనిమిదిన్నరకో రాజమండ్రిలో స్వామిజీ వేషంలో ఒకాయనెక్కాడు. నేను గోదావరిచూసి పడుకుందాంలే అని లేచా. మేం కూర్చున్న ఐదుసీట్ల చెక్కపై కూర్చున్నాడు. ఎదురుకూర్చున్న ఒకావిడని మీది ఫలాన ఊరు కదా, ఫలానఫలాన కదా అని మొదలుపెట్టాడు. ఆవిడకూడా మొహం వెలిగిపోయింది, భలే చెప్పారండీ, తమరు ఫలానావారింటికి వచ్చారుగదా అని ఆయన్ను గుర్తుపట్టింది. ఇక తన జ్యోతిషవిద్య చూపించడం మొదలుపెట్టాడు. నేను కళ్ళుమూస్తూ తెరుస్తూ గమనిస్తున్నా.

ఈ గురూజీ పక్కన ఒక పల్లెటూరి యువకుడు, పదహారుకన్నా వుండవు కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇవన్నీ వింటూ, "గురూగారూ, మీరు జరగబోయేవన్నీ చెప్పగలరా? ఐతే నాకు ఏం జరుగుతుందో చెప్పండీ" అనడిగాడు.
ఆ గురూజీ అతన్ని తేరిపారజూసి నేను చెప్పినా నీకు వినగలిగే యోగ్యతలేదు నాయనా అన్నాడు. అతను "ఎందుకండీ? నేను ఇలా పల్లెటూరివాడిలా కనిపిస్తున్నా; మీకు డబ్బులివ్వలేను; ఆవిడయితే బాగా డబ్బులిస్తుందనేగా" అని అడిగాడు. గురూజీకి దబ్బున కోపమొచ్చింది. మాటామాటా పెరిగాయి. వాదించుకోవడం మొదలుపెట్టారు.

ఇక ఆ అబ్బాయికి సపోర్టుగా కొందరూ, ఈయనకి సపోర్టూగా కొందరు, వినోదంచూస్తూ మరికొందరు. మా రాంలా వారి ఊహాలోకాల్లో హాయిగా విహరిస్తూ కొందరు. నాలా, కిరణ్లా, నిద్ర చెడిపోయి తిట్టుకుంటూ అతి తక్కువమంది.

కాసేపట్కి కుర్రాడు ఆవేశంతో ఊగిపోతూ, "మీరన్ని చెప్పగలరు కదా? ఐతే నేనిప్పుడు ఉచ్చపోస్తానా పొయ్యనా చెప్పండి" అని సవాలు విసిరాడు"? ఎదురుకూర్చున్నావిడ ఇక తిట్లు(బూతులతో) మొదలుపెట్టిందీ - సచ్చినోడా! పెద్దాయన్ని పట్టుకుని ఏంటా మాటలు అని. ఆ పిల్లాడిని సపోర్టు చేసేవాళ్ళేమో, "తప్పేంటండీ? ఆయనకి అన్నీ తెలిస్తే చెప్పమనండీ, పోస్తాడో పొయ్యడో". కుర్రోడేమో "మీరు పోస్తావంటే, నేను పొయ్యను - మీరు పొయ్యనంటే నేనిప్పుడే వెళ్ళిపోస్తా" అని. ఆ గురూజీ ఏదో డొంకతిరుగుడు సమాధానాలివ్వడం, వీడు "అవన్నీ ఎందుకండీ? నేను పోస్తానా పొయ్యనా జెప్పండి" సూటిగా చెప్పండని.

ఈ దెబ్బకి మా రాం. బస్సులు ఏక్సిడెంట్లవుతున్నా చలించనివాడు, నిద్రలేచి, "ఏంట్రా, పోస్తానా పొయ్యనా అంటూన్నాడూ. ఏంటిరా ఈ గొడవ" అని ప్రశ్నలు మొదలుపెట్టాడు. వాడికి మొత్తంచెప్పా.

ఈ లెక్కన నూజివీడు దాటేవరకు గొడవజరుగుతూనే వుంది. ఇంక నిద్రెక్కడపోయేది. విజయవాడ స్టేషను బయట సిగ్నల్కోసమో, క్రాసింగుకోసమో గంటపైనే పడేశాడు. ఎదురు పెద్దావిడ చూసిచూసి, "గురువుగారితో గొడవకోసం నువ్వెందుకు ఆపుకుంటావు, వస్తేపోసిరావచ్చుగా" అనింది. నాకువచ్చినప్పుడే నాకు నచ్చినప్పుడే పోసివస్తా? అయినా ఈయన్ని చెప్పమనండీ, నేను నా జాతకం ప్రకారం ఇప్పుడుపోస్తానో, పొయ్యనో అని.

మాకు సహనం నశించీ, ఆకలితో కృశించీ నీరసంతో పడిపోయే దశకి చేరుకున్నాం. ఇంతలో రైల్వేవారు దయతలచి మమ్మల్ని నిజయవాడకి చేర్చగా, ఇంక ప్రయోగాలు చాలని అక్కడి నుండి డైరెక్టు బస్టాండుకి చేరి బస్సుపట్టుకొని మధ్యాహ్నం రెండిటికి గుంటూరులో ఎవరిళ్ళకి వారు చేరుకున్నాం.


ఇలా వుంటాయి మా ఆలోచనలూ-తెలివితేటలూ, వాటితో మా నిర్వాకాలు. అప్పుడప్పుడేలేండి ఏదో ఆవేశంతో, లేకపోతే మేము చాలా ఆర్గనైజ్డ్.

20, అక్టోబర్ 2010, బుధవారం

సుందోపసుందులు - 2 : గుంటూరు-కాకినాడ బస్సుయాత్ర - 2

క్రిందటి భాగంకి కొనసాగింపు


...అలా బయలుదేరిన రావులపాలెం బైపాస్ ఎక్స్‌ప్రెస్ రామవరప్పాడు రింగురోడ్డు దాటి విజయవాడ బయటపడేసరికి మూడయ్యింది. అది ఇంకా ఎండలు పూర్తిగా తగ్గని రోజులు. మన ప్రయాణమేమో గుంటూరు, బెజవాడ, ఇలా. ఉన్నదేమో మిట్టమధ్యాహ్నం హైవేపై బస్సులో. ఇంక ఒక్కటే ఉక్క. నాకేమో ప్రయాణాల్లో నిద్రపట్టదు. రాత్రి రెండిటికి కూడా కిటికీలోకి తలపెట్టి చూస్తుంటా. అందుకే నాకు వోల్వో ఇష్టముండదు. ముందురాత్రి కొంచెంకూడ నిద్రలేపోటానికి అదీ ఒక కారణం. మావాడేమో నాకు పూర్తి విరుద్ధం. వాడదృష్టవంతుడు. ఇలా పిలవగానే, వుహూఁ అసలు పిలవకుండానే అలా నిద్రాదేవి కరుణిస్తుంది.

గుంటూరు బస్టాండులో బస్సెక్కితే చిలకలూరిపేట కాలేజిగేటు ముందు మేం కదిపిలేపేవరకు హాయిగా పడుకుంటాడు. ఒకసారి అలాగే పేటలో ఎక్కి పడుకుని విజయవాడలో కండక్టర్ ’బాబూ లేమ్మా, ఇదే లాస్ట్ స్టాపు’ అంటే లేచి, ’అరే ఇదేంటీ, గుంటూరు బస్టాండులా లేదే’ అనాశ్చర్యపోయి అదే బస్సులో తిరిగొచ్చాడు. వాడి నిద్రగురించి ఒక పూర్తి టపా కేటాయించాలి తీరికున్నపుడు.

సరే వాడేమో అలా హాయిగా ఊహాలోకాల్లో విహరిస్తుంటే, నేనేమో పొలాలని, వెనక్కి పరిగెడుతున్న లారీలు, చెట్లు, ఊళ్ళు, ఊళ్ళ బోర్డులు, మైలురాళ్ళు, ఇలా చూసుకుంటూ - మరి అవి ఐపాడ్లుకాదు కదా, పామాట ఆడుకోవడానికి సెల్ఫోను కూడా లేనిరోజులు. ఇంతలో డ్రైవరుకి టీ తాగాలనిపించిందో, మరి ఆ క్యాంటీనువాడితో అండర్స్టాండిగో హనుమాన్ జంక్షను బస్టాండులో ఆపాడు. అలా టిఫినీలు, కాఫీలు, టీలు అయ్యి మళ్ళీ రోడ్డెక్కేసరికి నాలుగు.

అలా ఏలూరు బైపాస్ జంక్షన్లు రెండూ (మొదటిది దింపడానికి, రెండవది ఎక్కించుకోవడానికి: మరి బైపాస్ ఎక్స్‌ప్రెస్ కదా, ఊళ్ళోకి పోదట), తాడేపల్లిగూడెం బైపాస్ జంక్షను దాటామ్. ఈలోపు గడియారంలో చిన్నముల్లు ఐదు దాటింది. అప్పటికి మావాడు లేచి, ఏరా ఇంకా రాలేదా? మూడుగంటల్లో వెళ్ళిపోతామన్నావ్. నాక్కాలిందిగానీ, మళ్ళీ వాడు పడుకుంటాడేమో, నాకెవ్వరూ దొరకరు కాలక్షేపం చేయడానికి అని ఊరుకున్నా.

సర్లేండి, మరీ బోరుకొట్టిస్తున్నా, ఇలాంటి ప్రయాణాలు అందరికీ వుండేవేగా అనుకుంటుండుంటారు. కొంచెం "మధ్యలో డ్రైవరుగారు తణుకులోకి బస్సుతిప్పి ఇచ్చిన్న ఝలక్ వదిలేస్తే", ఎట్టకేలకు ఆరు-ఆరున్నరకి రావులపాలెం చేరాం.

అబ్బా బయటపడ్డాంరా బాబూ అని దిగిచూస్తే కాకినాడకి బస్సులేదు. కడుపులోనేమో కాలుతుంది. ఎదురుచూసే జనాలేమో చాలామంది. తిండానికి వెళ్ళితే బస్సుపోతుందేమో, లేదా సీటు దొరకదేమోనని. ఒక్క పదినిమిషాలు చూసి కాఫీ తెచ్చుకున్నాం. అలా ఒక్క గుక్క తాగామోలేదో బస్సొచ్చింది. కాఫీగ్లాసులు పడేసి దాడిచేసి ఆఖర్న ఒక రెండు సీట్లు సంపాదించాం. ఇంకప్పుడు ఫోన్లు మొదలుపెట్టాం, కాకినాడలో ఎక్కడ దిగాలి, ఎవరు వస్తారు మమ్మలి మండపం తీసుకెళ్ళడానికి. నాకు లేదన్నాగానీ, మావాడిదగ్గరలేదని చెప్పలేదుగా. ఆ మాత్రం ఏర్పాట్లు, జాగ్రత్తలు లేకుండ నేను కొత్త చోటుకి వెళ్ళనుగా.

ఇంక ఈ కాకినాడ బస్సువాళ్ళు (డైవరు-కండక్టరు) బైపాస్ ఎక్స్‌ప్రెస్సువాళ్ళకి పోటీ - బహుశా ఒకే డిపోనేమో. వాళ్ళు టిక్కెట్లు కొట్టడానికి రావులపాలెం బయట, మండపేట, రామచంద్రాపురం బస్టాండు, కాకినాడ ఊరిబయట మూడు స్టాపులు ఆపుకుంటూ - బయటేమో చీకటి, మావాళ్ళు చెప్పిన స్టాపు దాటేసేమోనని డౌట్లు. మిత్రుల ఫోన్లు రెస్పాన్సులేదు. ఇంకేం టెన్షన్లు. టౌనులోకొచ్చాక ఎక్కడో ఒకచోట దిగేశాం.

అప్పుడు ఫ్రెండుకి ఫోను చేస్తే వాడు ’అక్కడెందుకు దిగార్రా’ అని తిట్టి వచ్చి తీసుకెళ్ళాడు. పెళ్ళిమండపంకి ఎంటరవ్వగానే సీదా భోజనాల ఫ్లోరుకి తీసుకెళ్ళాడు. మా గ్యాంగు అక్కడ - హాయిగా కబుర్లు చెప్పుకుంటూ - మరి కాలేజీ నించి ఎవరి దారిన వాళ్ళెళ్ళిపోయాక ఏడాదికి కలుసుకున్నారుగా. అన్నీ వడ్డిస్తున్నారు. అరే, అదేంటిరా క్రింద పెళ్ళికెళ్ళొద్దాంరా అంటే ఒక్కసారిగా నవ్వడం మొదలు. మరప్పుడేమో ఎనిమిదవుతుంది, ముహూర్తం ఏడున్నరకి. సరే ఇంతలో కృష్ణ వచ్చి వాళ్ళక్కాబావల్ని (పెళ్ళి జంట) పరిచయం చేస్తా అని తీసుకెళ్ళాడు. చూశారా, పెళ్ళికూతురుగానీ, పెళ్ళికొడుకుగానీ తెలీకుండానే ఎగేసుకొని వెళ్ళిపోయాం.

మండపంలోకెళ్తే పట్టుచీరలు-సెంటువాసనలు: మనమేమో తుక్కుబట్టలూ-చెమటకంపులు. సరే అభినందనలు చెప్పి పైకొచ్చాం. అక్కడ షాకు - విజయవాడలో ధైర్యంచేసి స్టేషనుకి పరిగెట్టిన మావాడు కిరణ్ - హుషారుగా కబుర్లు చెప్తూ. నోరెళ్ళబెట్టిన మమ్మల్ని చూసి, ఆ రైలు లేటురా, దొరికింది, ఆరింటికే వచ్చానన్నాడు. ఏం చేస్తాం. మీరెలా వచ్చార్రా అని అడిగాడు. అదో పెద్ద కథలేరా, ఇప్పుడు చెప్పే ఓపికలేదులే.

ఇంక మిత్రులు భోజనాలు వడ్డిచడం మొదలుపెట్టారు. ఆకలితో నకనకలాడుతున్నా అందరం చాలా కాలానికి కలిసాం, కలిసి తిందాం అని ఆగీఆగి పదింటికి పూర్తి చేశాం.

ఇంతవరకు జరిగినది మాకు చాలా మామూలు అనుభవమే - అసలు ఘనకార్యం ఆ రాత్రికి చేశాం.

(సశేషం)

19, అక్టోబర్ 2010, మంగళవారం

సుందోపసుందులు - 1 : గుంటూరు-కాకినాడ బస్సుయాత్ర

చూసిరమ్మంటే కాల్చివచ్చే రకం నేనూ, అన్నయ్య, మా మిత్రులు. బయటికెళ్ళి అలాంటి ఘనకార్యం ఏదోకటి చేసుకొచ్చి ఇంటికి రాగానే అమ్మగానీ, ఆమ్మగానీ వేసే మొదటి పరామర్శ, ’ఈసారేం చేసుకొచ్చారు సుందోపసుందులు?’ అలాంటి మా ఘనకార్యాలు, ఎదురైన వింతనుభవాలు ఈ ’సుందోపసుందులు’:

ఇలాంటి ఘనకార్యాల్లో నాతో ఎక్కువసార్లున్నది ఇంజినీరింగ్ మిత్రుడు రామ్ (పేరు మార్చబడింది). అవి ఇద్దరం హైదరాబాదుకి వచ్చి ఉద్యోగం చేస్తున్న రోజులు, కలవడానికెళ్ళా. తన రూమ్మేట్, కామన్‍ఫ్రెండ్ మా కాలేజివాడయిన కృష్ణ కాకినాడలొఏ శనివారం రాత్రి వాళ్ళక్క పెళ్ళని పిలిచాడు. సరే, వస్తామని మాటిచ్చాం.

మొదటడ్డంకి ఏంటంటే శనివారమ్ పొద్దున రామ్‍కి గుంటూరులో పనివుంది, అయ్యెసరికి ఎంతవుతుందో తెలీదు. అందుకని, రిజర్వేషనులాంటివేం చేసుకోలేదు. ఇద్దరం శుక్రవారంరాత్రి బయలుదేరి గుంటూరు వెళ్ళాం. ఆ రాత్రిక నిద్ర సరిగాలేదు. ఎందుకో తరచూ హైదరాబాదునించి శుక్రవారంరాత్రులు ఇంటికి బస్సుల్లో వెళ్ళేవారికందరికీ తెలుసు ఆ నరకం. భెల్ లింగంపల్లిలో తొమ్మిదికి మొదలయితే, కోఠీ పదకొండుకు, వనస్థలిపురంలో ఒంటిగంటకి బయటపడితె మళ్ళీ గుంటూరులో ఐదున్నరకల్లా దింపేస్తాడు.

శనివారం పన్నెండయ్యింది రాం పనిపూర్తయ్యేసరికి. పెళ్ళి ముహూర్తమేమో రాత్రి ఏడున్నరకి కాకినాడలో. అప్పుడాలోచించాం మొదలుపెట్టాం అసలు వెళ్ళాలా వద్దా, వెళ్ళితే ఎలా వెళ్ళాలా అని? అదే పెళ్ళికి వెళ్తున్న వేరే ఫ్రెండ్ కిరణ్కి ఫోన్చేస్తే రెండింటికి విజయవాడలో రైలుంది, నేనూ గుంటూరు బస్టాండుకి వస్తా వెళ్దామన్నాడు. వాడు నరసరావుపేటనున్డి రావాలి. వాడికోసం ఎదురుచూస్తుంటే రెండు, మూడు బస్సులెళ్ళిపోయినాయి. తీరా వాడు వచ్చాక ఒక్క బస్సూ లేదు. మామూలుగా అయితే ప్రతినిమిషమూ విజయవాడ-గుంటూరు మధ్య బస్సుండాల్సిందే. ఏం చేస్తాం, అప్పుడుకూడా ఊహించలా ముందుముందు ఏంరాబోతున్నాయో?

బస్సుదొరికి విజయవాడ చేరేసరికి ఒకటీముప్పావయ్యింది. ఇంకేం పరిగెడతాం బస్టాండ్ నుండీ రైల్వేస్టేషన్కి, ఆ రైలు దొరకదులే అని. ఇక్కడొక విషయం - మా ముగ్గురంలో ఎవ్వరం విజయవాడదాటి ఆపైకి వైజాగ్‌వైపు వెళ్ళలేదు. కిరణేమో, ఏమైతే అదైందిరా స్టేషన్కే వెళతానన్నాడు.

కళ్ళముందు రావులపాలెం బస్సు బయలుదేరింది. అప్పుడు నేను నా జాగ్రఫీ తెలివితేటలు చూపించా. అరే, మనం రావులపాలెం పోతే అక్కడినుంచి కాకినాడ వెళ్ళొచ్చురా అన్నా. కండక్టర్ని అడిగాం రావులపాలెమెళ్ళేసరికి ఎంతవుతుంది, అక్కడ్నించి కాకినాడ ఎంతసేపని. అతను ఇది బైపాస్ ఎక్స్‌ప్రెస్, మీకెందుకు ౩ గంటల్లో వెళ్ళిపోతారు, అక్కడినించి గంటన్నర.

ఇంకేం ఆరున్నరకల్లా కాకినాడలో వుంటామని మావాడిని నాతో బస్సెక్కించా.

(సశేషం)

15, అక్టోబర్ 2010, శుక్రవారం

నాన్న - ఒక జ్ఞానతృషితుడు

ఇంజినీరింగు కాలేజీ నుండి క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా డైరెక్ట్ ఐటీజాబ్లోకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి ఒక రెండు మూడేళ్ళు ఎంజాయ్ చేశాక చాలామందికి ఒకరకమైన అసహనం మొదలవ్వవుతుంది. అదే పాతికేళ్ళకి జనాల్లో పుట్టే క్వార్టర్లీ లైఫ్ క్రైసిస్ (QLC).

"థూ సాఫ్ట్వేర్ జీవితం"; "మనమేం చదివాం, ఏం చేస్తున్నాం, దీనికన్నా ఊరికెళ్ళిపోయి ఆటో తోలుకుంటం నయం";"ట్యూషన్లు చెప్పుకున్నా ప్రశాంతంగా వుంటుంది" అని డైలాగులు కొడతారు. అందరూ కాదులేండి. కొందరు మటుకు వట్టి బీటెక్ ఏంటి, ఒక ఎంబీయేనో, ఎంటెక్కో చేయాలి అని తపిస్తుంటారు. క్యాట్ రాస్తా, జీమాట్ రాస్తా అంటారు.

కారణం ఏదైనా కావచ్చు - జ్ఞానం, డబ్బు, కెరీర్, ఉద్యోగాభివృద్ధి,ఏదైనా.

కానీ ఇలాంటివాళ్ళల్లో చాలామంది మాటలతోనే ఆగిపోతారు. ఏంటయ్యా అంటే బిజీ, టైం లేదు అంటారు. అలాంటివాళ్ళల్లో నేనూ ఒక్కణ్ణి ఒక్కప్పుడు.
అసలు ముఖ్యకారణం మటుకు చిత్తశుద్ధిలోపించడం.

కానీ మా నాన్నకి కొడుకుగా నేనలా అనగూడదు.

ఎందుకంటారా? ఒక్కసారి మా నాన్నగారి నేమ్‌‌ప్లేట్‌‌గానీ, విజిటింగ్ కార్డుగానీ చూడాలి.

వై.భాస్కర్ M.A(History), M.A.(English Lit.), L.L.B, B.Com, D.B.M, D.P.M.,D.I.M, A.D.I.M, C.A.I.I.B

మొన్నామధ్యనే యాబయ్యేదేళ్ళ వయస్సులో ఎంఏ హిస్టరీకి నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డ్మెడల్ (బంగారు పతకం) సాధించారు. పైవికాకుండ, 1987లోనే పిజిడిసిఏ చేశారు. బ్యాంక్లో వుండగా, ఫాక్స్ప్రో ప్రోగ్రామింగ్, బ్యాంక్ మాస్టర్లలో కమాండ్ సంపాదించారు. బ్యాంకు వుద్యోగంలో చేరెటప్పటికి డిగ్రీలేదు, టైపిస్టుగా చేరారు. తర్వాత సాయంత్రం కళాశాలకి రోజూ 20 కిమీ సైకిల్ తొకక్కుంటూ వెళ్ళి బీకాం చేశారు.

రెండు పీజీలు, లా యాబైల్లోకి వచ్చాకే చేసినవి.

విజువల్ బేసిక్, ఎచ్టీఎమ్ఎల్, జావాస్క్రిప్ట్ లలో మంచి ప్రవేశంవుంది. ఇప్పుడు పిఎచ్పీ, ఎక్స్‌‌ఎమ్‌ఎల్‌‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.

ఇక బ్లాగులకి వస్తే ఆయనకి 20 పైనే వున్నాయి. వాటిల్లో ఇంగ్లీషు వ్యాకరణం రామాయణం, మహాభారతం, వివేకానందుకడు, భర్తృహరి సుభాషితాలు, భారత ఆర్ధికం, భారత కరంట్ అఫైర్స్, ఆయుర్వేదం, వంటలు మొదలగునవి ముఖ్యమైనవి. ఏ అంశం అయినా ఆయన దగ్గర సమాచారముంటుంది. లేకపోతే తెలుసుకోవాలనుకుంటారు.

సంస్కృతం నేర్చుకున్నారు - కావ్యాలనీ, వేదాలనీ అధ్యయనం చేయడానికి.

వారనికొకటి అయినా ఆయన వ్యాసం 'వార్త‌' పత్రికలో మూడవపుటలో ప్రచురించబడుతుంది. ఈనాడులో ఇదివరకు వచ్చేవి, ఇప్పుడు పంపించడం ఆపేశారు. నా చిన్నప్పుడు విదేశీమారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్ఛేంజి) మీద ఆయన వ్రాసిన వ్యాసాలు హిందూ,ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ పత్రికల్లో వచ్చేవి.

ఇంక సంగీతం: నేను పుట్టకముందు తబ్లా, హార్మోనియం కొంత నేర్చుకొన ప్రయత్నించి బాధ్యతలవలన వదిలేశారు. తరువాత సితార్ (ఇప్పటికీ వుంది), ఇప్పుడు వేణువు (ఫ్లూట్) నేర్చుకొని రోజుకి కనీసం మూణ్ణాలుగు గంటలు వాయిస్తున్నారు.

చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు, కొంచెం గర్వపడేది ఏంటంటే, ఎప్పుడన్నా గుంటూరింటికి వెళ్ళినప్పుడు - ఎవరైనా మాయింటికి వస్తే నేనేమో కింద గదిలో టీవీలో ఏదో చెత్త చూస్తూ, మా నాన్నగారేమో పైన గదిలో ఏదోకటి వ్రాస్తూనో, చదువుతూనో కనిపిస్తాం.

మరి ఏం మాయరోగం - ఏదోకటి చదువడమో, నేర్చుకోవడమో చెయ్యొచ్చుగా అంటారా? సర్లేండి. నేను చాలా బిజీ. ఇప్పుడు (రాత్రి పన్నెండున్నర) ఇండియా టీంకి కాల్ చేయాలి, రేప్పొద్దున్నే ఎనిమిదింటికి క్లైంట్ మీటింగు - మధ్యలో తెలుగు బ్లాగులు, ఇంగ్లీషు బ్లాగులు, ఫేస్బుక్, ట్విట్టర్, క్రికెట్, ఎన్నని. అస్సలు టైంలేదండి బాబూ.

చివర్గా ఒక్క కోరిక - ఎప్పటికైనా నా పిల్లలు (భవిష్యత్తులో పెళ్లై పుట్టినప్పుడు) నన్ను ఒక తండ్రిగాకన్నా, ఒక వ్యక్తిగా నన్ను ఆరాధించాలి - ఎలాగైతే మా నాన్నని చూసి మేమనుకుంటామో.

L.L.B - Law
D.B.M - Diploma in Business Management
D.P.M.- Diploma in Personnel Management
D.I.M.- Diploma in Management
A.D.I.M. - Advanced Diploma in Management
C.A.I.I.B. - Certified Associate of the Indian Institute of Bankers

పి.ఎస్: నాన్నగారి బ్లాగులన్నీ ఆయన ప్రొఫైల్లో వున్నాయి: http://www.blogger.com/profile/13635995478285822763

ఆయన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మా (అన్నయ, నేను) వంతుగా ఒక వెబ్సైట్ పెట్టాం - దానికి ఇంకా బాలారిష్టాలు తొలగలేదు. ఆసక్తివుంటే - www.knowquest.info

తృష్ణ = దాహం
తృషితుడు - దాహంకలవాడు.