4, డిసెంబర్ 2010, శనివారం

సుందోపసుందులు 4: ’డెల్టా’ తంటా

సమయం: ఎండాకాలం రాత్రి 1-4 మధ్య
స్థలం: ప్యాసింజరు బండి, జనరల్ కంపార్టుమెంటు
ఇతర పాత్రలు: నిండుగా కాలుపెట్ట చోటులేనంత జనం - కూర్చొని నిద్రపోయేవారు-నించోని జోగేవారు. వారి స్టేషను దగ్గరపడితే కనులు మూస్తూ తెరుస్తూ దిక్కులు చూసేవారు. మధ్యమధ్యలో సమోసాలు-మసాలాలు, టీ-కాఫీలు అమ్మువారు.

కథానాయకులు:

1.జేబీ (అంటే నేను) - ఒళ్ళో 1000 పేజీల బండ పుస్తకం, చేతిలో మార్కరు/హైలైటరు
2. మనో - ఒళ్ళో 1500 పేజీల దిండు పుస్తకం, చేతుల్లో నోటుబుక్ మరియు పెన్సిల్.

నమ్మట్లేదు కదూ? వీళ్ళు కొంచెం ఎక్స్‌ట్రాలు చెయ్యట్లా?

నటించట్లేదు. తరువాత క్లియరు చేసిన సర్టిఫికేషనుపైనొట్టు, నిజ్జంగా చదివాం.

ఎందుకిలా? ఈ సుందోపసుందులు ఏ ఘనకార్యం చేయుటవలన ఇన్ని అవస్థలూ-నీలాపనిందలు పడుతున్నారు?

ఒక ఇరవై రోజులు వెనక్కి వెళ్ళితే...
***************

ఈ జేబీ అనబడు నేను, ఒక వారాంతం పొద్దునే (అనగా పదికి) హిందూ పేపరు చదువుతుండగా ఒక వార్త ఆకర్షించినది. సికిందరాబాదు-రేపల్లె మధ్యన వయా గుంటూరు డెల్టా పాసింజరని కొత్తగా రైలు వేసారట. వార్త చదివి సంతోషం తట్టుకోలేక ఆవేశం ఆపుకోలేక రిజర్వేషను ఆఫీసుకెళ్ళిపోయా. లైన్లో నించొని మనోకి ఫోనుకొట్టా, "నీక్కూడా చేయించనా"ని. వచ్చే శుక్రవారంరాత్రికి చేయించేశా, ఆహో మనక్కూడా దొరికాయే అని పొంగిపోతూ.

***************

ఎనిమిదిముప్పావుకి రైలు సమయమైతే అలవాటుప్రకారం ఏడింటికి చేరుకున్నా. అప్పటికే కొంచెం సాఫ్ట్వేరు కళలు కొన్ని వచ్చాయికాబట్టి చెవుల్లో ఎంపీ౩-వీపున బ్యాక్‌ప్యాక్-టీ-షర్టు-ఫీలా కాజువల్ షూస్-చేతిలో ఒక ఇంగ్లీషు పత్రిక-ఇంకో చేతిలో రియల్ జ్యూస్ - ఇప్పుడు శుక్రవారం రాత్రి స్టేషను నిండా ఈగల కన్నా మా జాతే ఎక్కువుంటారుగానీ మరి 2004-05ల్లో గోదావరి-గౌతమి వంటి రైళ్ళ ప్లాట్ఫాంలపై ఓ పదిమంది తప్పితే ఎక్కువ కనిపించేవారు కాదు (నాకు). అందులోనూ మాది ప్యాసింజరు బండి.

వీడెవడ్రా బాగా వేషాలేస్తున్నాడు (అదే స్టైలుకొడుతున్నాడు) అని జనాలు అనుకుంటుంటుండగా ప్లాట్‌ఫాంపై అటు ఇటు తిరుగుతూ మావాడికోసం ఎదురుచూస్తున్నా. నేనంటే టోలీచౌకీనుండి రావాలిగానీ, మావాడుండేది కవాడీగూడ, చక్కగా నడుచుకుంటూ రావచ్చు. ఫోనుకొడితే ఎనిమిదికి ముందు బయలుదేరేది లేదన్నాడు.

భారత రైల్వేల ఆచారం ప్రకారం కాకుండ ఎనిమిదిన్నరకి, అంటే పావుగంట ముందే బండి పెట్టేశారు (ఇప్పుడు 9.30 అవ్వాలి). ఒక్కసారి కలకలం చెలరేగి ఉరుకులు-పరుగులు మొదలయ్యయి. మనం రిజర్వేషను కదా - దర్జాగా నించున్న. మనకీ కొంచెం మంచి అలవాట్లుండటంవల్ల, నెమ్మదిగా భోగీ తలుపుదగ్గరికెళ్ళి ఛార్టులో పేర్లు రూడీచేసుకుందామని వెతకటం మొదలుపెట్టా. అప్పుడు చిన్న షాకు. మన పేర్లులేవు. రెండుమూడుసార్లు చూశా. ఉహూఁ! లేవు. టిక్కెట్టు మళ్ళీ చూశా - ఆఁ అప్పుడు తగిలింది. మనం తేదీలో ఒక నెలెక్కువేశాం అని. హహ్హహ్హహా! ఛీఛ్చిఛీఛీ - కొన్ని తలలు తిరిగాయి అటువైపు, (అంటే మనవైపు) వీడికేమయ్యిందని.

అప్పుడు పరిస్థితిని సమీక్షించగా కర్తవ్యం గుర్తొచ్చింది. మనోకి ఫోనుకొట్టా, "ఏరా ఎక్కడున్నావ్?"
వాడు "వచ్చేసినట్లే- ఫైవ్ మినిట్స్. రైలొచ్చేసిందా?"
చేసిన ఘనకార్యం చెప్పా.
వాడు "ఇప్పుడేం చేయాలిరా?".
"నువ్వెక్కడున్నావ్?"
"ఇప్పుడే భోయిగూడ చేరుతున్నా!"
"ఒహో! ఐతే నువ్వు సీదా ఒకటో ప్లాట్ఫాంకిపోయి (అప్పటికి భోయిగూడ కౌంటరులేదన్నట్లు గుర్తు) రెండు టికెట్లు పట్టుకురా. నేనెళ్ళి రెండు సీట్లాపుతా". స్లీపరుబోగీలన్నీ దాటి ఆఖరునున్న జనరల్‌కి పరిగెట్టా. రెండు సీట్లు ఏదోవిధంగా సంపాదించా.

మనో కూడ పాపం లగేజితో స్టేషను ఈమూలనించీ ఆ మూలకి పరిగెట్టి, లైన్లో నించొని ఎలాగోలా టిక్కెట్లు తీసుకొచ్చాడు.

***************

సరే ఇలాంటి టికెట్ల గూఫులు అందరికీ ఎప్పుడోప్పుడుండేవేలే అని సరిపెట్టుకున్నాం. అక్కడితో కథ ముగిస్తే మరి మా ప్రత్యేకత ఏముంది...

**************

రైలు బయలుదేరింది. మేం ప్రత్యక్షంగా కలుసుకొని చాలా రోజులు అయ్యింది. ప్యాసింజరు బండీ, ఘట్కేసరు చేరేసరికి రాత్రి పదిమాత్రమే అయ్యింది. కాలక్షేపం ఎలా అవుతుంది? దాంతో బాతాఖానీ మొదలుపెట్టాం. ఇద్దరు సాఫ్ట్వేరుగాళ్ళు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారు - అదే జరిగింది. మొదటి గంట ప్రాజెక్టుల గురించీ, ఒక అరగంట కంపెనీలగురించీ, ఆ తరువాత ఒక గంటన్నరా-రెండు గంటలు.

"పదకొండున్నరయ్యింది బాబులూ, మీరు కాస్త కబుర్లు ఆపితే మేం కాసేపు పడుకుంటాం" పాపం పక్కవాళ్ళు. మాకూ కొంచెం విశ్రాంతి కావాలి అనిపించింది. చెవుల్లో పాటల ప్లగ్గులు పెట్టుకున్నాం. మా వాడు పుస్తకాలు బయటికి తీసాడు. పరీక్షలట. వాడు దూరవిద్యలో ఏవో పైచదువులు వెలగబెడుతున్నాడు అప్పుడు. పది నిమిషాలు భారంగా గడిచాయి. ఇంతకుముందటి వ్యాసాల్లో చెప్పినట్లు నాకు ప్రయాణాల్లో నిద్రరాదు, మావాడేమో ఎప్పుడుకావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. హమ్మా! వాడు పడుకుంటే నా పరిస్థితేంటీ? ఎండాకాలం, పెట్టె నిండా జనం, ఉక్కపోత నాకు తోడు.

దాంతో మళ్ళీ ముచ్చట్లు మొదలుపెట్టా. "అరే, పన్నెండవుతుంది, రైలు మూడున్నరకల్ల గుంటూరెళ్తుంది -ఈలోపు ఏం పడుకుంటాం చెప్పు" . ఈ సారి మాసోదంతా పూర్తి సాంకేతికం - వాడి సబ్జెక్ట్లపై. కొంచెం తెలుగు, చాలా ఇంగ్లీషు.

మిగతావారు ఒక్కొక్కరు కళ్ళు తెరిచీ చూడటం, పడుకోవటం. కాసేపు చూసి పక్కనున్న ఒక పెద్దాయన ముందు కోరాడు, తర్వాత ఒక వార్నింగిచ్చాడు, "గమ్మునుంటారా, తలుపులోంచి తోసెయ్యనా". మాక్కూడ - నిద్ర రాలేదు, జాలివేసింది.

దాంతో నేనూ సంచీలోంచి ఒక పెద్ద సాంకేతిక గ్రంధం తీసా - అప్పట్లో ఒక సర్టిఫికేషనుకి తయారవుతున్నా.

అవ్విధంగా ఆ దృశ్యమెట్టిదనగా, అర్ధరాత్రి 1-4 మధ్యన, రైల్లో చదువుతూ || మొదటి పేరా చదువుకొనుడు||.

కొ.మె.: ఇలాంటి టిక్కెట్టు గడబిడలు అదే మొదటిసారికాదూ, ఆఖరిసారికాదూ.

2 కామెంట్‌లు:

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in