25, నవంబర్ 2010, గురువారం

ఈ-వ్యర్ధం

ఈ ప్రక్క చిత్రం చూడండి. ఒక వైర్లచుట్ట కనిపిస్తుందా? ఇవి నా దగ్గరున్న వైర్లల్లో మూడోవంతుకూడ కాదు. నా గది ఒక వైర్ల ప్రపంచం. రెండు లాపుటాపులు (ఒకటి నాది, మరోకటి సంస్థది - మూడోది వుండేది క్లైంటుది, ఇప్పుడు లేదు), వాటి ఛార్జర్లు, ఇంకా ఎంపీ౩, మొబైల్ (ఇవీ రెండు - ఒకటి నాది, రెండోది సంస్థది), ఎస్.ఎల్.ఆర్ కెమెరా, బ్లూటూత్ - వీటన్నిటికీ ఛార్జర్లు,
 
కనెక్టు చేయుటకు యూఎస్‌బీ కేబుళ్ళు, రీఛార్జబుల్ బ్యాటరీలు, ... - అంతులేని కథ. చిత్రములోనివికాక ఇక్కడ ఒక సంచినిండా, ఇంకొన్ని స్వదేశంలో. ఇంటికెళ్ళినపుడు ఇవన్నీ హాలునిండా పరిచి అమ్మచే తిట్లు తింటూంటా. మరన్నీ కావాల్సినవే, ఛార్జింగు చేయాల్సినవే.

పర్యవరణానికి నావంతుగా ఇలా హానీ కలిగించడం నాకు అప్పుడప్పుడు బాధ కలిగిస్తుంటుంది. కానీ ఏంచేస్తాం ఆసక్తులని ఆపుకోలేంగదా. నేనేకాదు ఎవ్వరూకూడ. ఐతే నన్ను నేను సమర్ధించుకోవడం లేదు, నేను చెయ్యగలిగేవి నేను చేస్తూనే వుంటా. కాకపోతే మనం నివారించగలిగేవి కొన్నుంటాయి.

ఏ ఫోనైనా, కేబులైనా, బ్యాటరీయైనా అందులో ప్లాస్టిక్, ప్రమాదకర లోహములుండటం సాధారణం.

ఆర్నెల్లొకకసారి మొబైలు మారుస్తున్నాం - అది పాడయిపోవటంవలన కావచ్చు, కొత్త మోడళ్ళపై మోజో, ఏదైన కావచ్చు. మా ఇంట్లోనే దాదాపు పది మొబైల్సు కొనుంటాం. మరి ఆ పాత ఫోన్లు, ఛార్జర్లు ఏమైతున్నాయి?

గడియారం, గోడ గడియారం, పిల్లల ఆటవస్తువులు, టీవీ రిమోట్లు, టార్చిలైట్లు - ఇలాంటివాటన్నిట్లో వాడే బ్యాటరీలు ఏమవుతున్నాయి?

చెత్తబుట్టలోకి పోతున్నాయి. రోబో సినిమాలోలా ఈ-వ్యర్ధం గుట్టలు. అది ఎంత ప్రమాదకరం?

సాంకేతిక విప్లవంలో కొట్టుకుపోయీ, అవగాహనలేమివలనా ఈ ప్రమాద తీవ్రతను మనలో చాలామంది గుర్తించుటలేదు.

పెద్దపెద్ద ఐటీ సంస్థల్లో కొంతవరకు పనికిరాని ఈ-చెత్తని సేకరించి రీసైకిలు చేస్తున్నారు. కానీ అక్కడ కూడ ఉద్యోగులు అంత శ్రద్ధ చూపిస్తున్నట్లు లేదు. అంతెందుకు ఇక్కడి మా అమెరికా కార్యాలయంలో కాగితం-ప్లాస్టిక్-ఎలక్ట్రానిక్ ఇలా మూడురకాల డబ్బాలున్న, అన్నీ కలిపేసేవారు పెక్కుమంది.అంటే శ్రద్ధచూపేవారు లేరనికాదు.

మీరు మీ పాత ఛార్జర్లు, ఫోన్లు ఏంచేస్తున్నారు?

నోకియా కేర్ సెంటరులో వెయ్యండి. వారే రీసైకిలు చేస్తారు. purti మిగతా మొబైలు తయారీదారులు, షాపింగుమాలుల్లోనూ నాకు తెలిసి సేకరిస్తారు.

ఇవన్నీసరేగానీ మొబైలు తయారీదారులు అందరూ ఒకేలాంటి ఛార్జర్లు ఎందుకు చేయరు. నోకియా అయితే ఇదివరకు పెద్ద పిన్‌తో, ఇప్పుడు చిన్న పిన్‌తో చేస్తుంది. కొత్త ఫోనుకొంటే మళ్ళీ ఒక కొత్త ఛార్జరు. నికానువాడు ఎస్‌డీ కార్డువాడితే, సోనీ మెమొరీ స్టిక్, ఇంకొకరు మైక్రో ఎస్‌డీ - ఒకే టెక్నాలజీ ఎందుకు వాడరు? నా ఆలోచనలకి తగ్గట్టే ఎవరో ఈ క్రింది వీడియో చేశారు.

తయారీదారులు అందరూ ఒకే ప్రమాణాలు పాటిస్తే కొంతవరకూ ఈ వ్యర్ధము కొంత తగ్గుతుంది కదా!


21, నవంబర్ 2010, ఆదివారం

పెసరట్టు + అల్లప్పచ్చడి + బ్రూ కాఫీ

భాస్క్రర్ రామరాజుగారు వారాంతంలో ఉల్లిపెసర కుమ్మారంట, బొమ్మలు చూపించి నోరూరించారేగానీ ఎలా చెయ్యాలో చెప్పలా. అహా! నాకు రాదనికాదు, ఇంటర్నెట్లో దృశ్యాలు దొరకవనికాదు; తోటి గుంటూరువాడికి స్థానిక పద్ధతిలో చెప్తారని.

అందుకే, నేను ఇవాళ పొద్దునే (పదకొండుకి) లేచి చేసేశా. పనిలోపని అల్లప్పచ్చడి కూడా చేశా. పెసరట్లు కుమ్మాక చిక్కటి కాఫీ గొంతులో పడితేనేగా మజా. ఫిల్టరు కాఫీ లేదు, ఏం చేస్తాం, బ్రూ కాఫీతో సరిపుచ్చా.

బ్రహ్మచారి ఒక్కడే అమెరికాలో చీజ్ పిజ్జాలు- వెజ్ బర్గరులు తినలేక కష్టపడుతున్నాడని పాపం ఇంట్లోవాళ్ళు తల్లడిల్లుతుంటారు, మనం ఇక్కడ రోజూ కుమ్ముతున్నామని చెప్పినా నమ్మట్లా. అందుకే వాళ్ళకోసం, నోరూరించి నాలో పౌరుషం+పట్టుదల రగిలించిన భాస్కర్‌‌గారి కోసం ఈ క్రింది చిత్రము.

 
Posted by Picasa

1, నవంబర్ 2010, సోమవారం

కాలేజీ కబుర్లు: 'మీరు చూచిన ఇంజినీరింగు అద్భుతం'

అది ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం. మూడో నెల్లోకొచ్చాం. ఇంగ్లీష్ ప్రొఫెసర్ రెండవ ఇంటర్నల్ దిద్దినపేపర్లు పట్టుకుని వచ్చారు.

అందరిలోను ఆత్రుత, వారిమార్కులే కాదు, క్లాసులో ఒకబ్బాయికి ఎంతొచ్చాయని. ఒక్కక్కరివీ వస్తున్నాయిగానీ అతనిది రావట్లేదు. అందరికీ కొంచెం, ఆ అబ్బాయికి అంతకన్నా ఎక్కువ ఉత్కంఠ. సాధారణంగా ఆ అబ్బాయి మార్కులగురించి అందరిలా ఎక్కువ టెన్షనుపడడు. ఎందుకంటే రాయడంవరకే మనవంతు, మార్కులు దిద్దేవాళ్ళ మూడు, దయ అని అతనిది ఒక మెట్టవేదాంతం. మరి ఆ అబ్బాయి ఎందుకు తపనపడుతున్నాడంటే ఒక నెల వెనక్కి మొదటి ఇంటర్నలుకి వెళ్ళాలి.

**********

ఫ్లాష్‌బాక్లో ఫ్లాష్బాకుకి వెళ్ళితే...

**********
మొదటి ఇంటర్నలు ఫలితాలు ఒక్కొక్క సబ్జెక్టుకిస్తున్నారు. మొదటిసారికాబట్టి అందరిలో ఒక ఆసక్తి, ఎవరికి ఎలా వచ్చాయో, ఎవరు తోపో, ఎవరుకాదో, ఎవరు మనకి పోటీ, ఎవరు మనకి వచ్చే పరీక్షల్లో సాయంచేస్తారో - ఇలా ఒక తహతహ. ఎంసెట్ రాంకుతో కొంచెం అందాజా వెయ్యొచ్చుగానీ, మరి పాలిటెక్నికునించి ఈసెట్ రాంకులు వచ్చినవారుగూడ వున్నారు.

మొదటగ ఇంగ్లీషు మార్కులిచ్చారు. సెంటెన్సు కరెక్షను చేయమని 40 వాక్యాలు ఇచ్చారు (అప్పటికింకా పాఠ్యపుస్తకాలు రాలా). ఈ అబ్బాయికి ఇరవైకి పంతొమ్మిదిన్నర (ఒక్కటే తప్పు) వచ్చాయి. అదే కాలేజీ టాపుస్కోరు. ఇద్దరుముగ్గురికి 12-13 వచ్చాయి (15 పైన ఎవరికీ క్లాసులో వచ్చినట్లు గుర్తులేదు). మిగతావారంతా తప్పారు. ఇంక ఇంగ్లీషుసారు ఆ పేపరుతీసుకుని ప్రతి బ్రాంచిలో ప్రదర్శనకి పెట్టిమరీ అందరినీ తిట్టారు చూసి బుద్ధితెచ్చుకోమని. మొత్తం కాలేజీలో పట్టుమని పదిమంది కూడ పాసవ్వలేదు. కాలేజీలో ఇంకొక్కళ్ళకి 15పై వచ్చినట్టున్నాయి.

దురదృష్టవశాత్తూ ఆ రోజు ఆ అబ్బాయి కాలేజికి రాలేదు. పాపం ఎంతటి అవకాశం పోగోట్టుకున్నాడో. అప్పటివరకూ క్లాసులోనే చాలామందికి తెలియని అతడు ఒక్కసారి కాలేజిమొత్తం పాపులరు అయ్యాడట్లా!

***********
మళ్ళీ ఒక నెల ముందుకు తిరిగితే....

***********
జనాలు ఆ అబ్బాయికెన్నొచ్చాయని ఎదురుచూస్తుండగా...

రెండవ ఇంటర్నలు మార్కులిస్తూ అందరు భాషాధ్యపకులులాగే మావాళ్ళు రాసిన ఉత్తమసమాధానాలూ, కథలూ కాకరకాయలూ బయటికి చదువుతూ అందరినీ నవ్విస్తూ సాగుతున్నారు. అలా అందరివీ అయ్యాక, చివరికి ఆ అబ్బాయిపేపరు తీసారు.

20 మార్కుల పరీక్షలో ఒక 10-12 మార్కుల ప్రశ్న: "మీరు చూసిన ఒక ఇంజనీరింగు అద్భుతం వివరింపుడు"

సారు అతని పేపరు పట్టుకొని, "ఈ అబ్బాయికి పోయినసారి కాలేజిలో ఫస్టుమార్కు. అప్పుడు నేను చాలా ఆనందపడ్డా. హమ్మయ్య, ఈ కాలేజిలో ఒక్కడున్నాడు అని (ఆ అబ్బాయి గాల్లో తేలుతున్నాడు). ఇక ఈసారికొస్తే, మీకు నచ్చిన ఇంజనీరింగు అద్భుతం వ్రాయండయ్యా అంటే ’హౌరా బ్రిడ్జీ - ఒక ఇంజనీరింగు అద్భుతం’ అని హెడింగుపెట్టి ౬ పేజీలు రాశాడు. విషయం చదవడానికి బాగుంది. గ్రామరు బాగుంది. తప్పులేమాత్రంలేవు. ఇంతవరకు బాగుంది, బాగా రాశావు. కానీ చదివేది కంప్యూటరు సైన్సు. ఇంజనీరింగు అద్భుతమంటే కంప్యూటరు గురించి వ్రాస్తావనుకుంటే హౌరా బ్రిడ్జీ, గణపవరం బ్రిడ్జీ (మా కాలేజిపక్కనే ఎన్‌ఎచ్5పై వుంది) ఏంటయ్యా? కనీసం రోబోలగురించి రాయొచ్చుగా. అస్సలు ఇలా రాయొచ్చొనే ఆలోచనెలావచ్చిందంటావ్ నీకు? నువ్వు నిజమైన ఇంజినీరింగు విద్యార్ధివనిపించుకున్నావ్ (ఇలా ఏవిషయమిచ్చినా పేజీలు నింపే సామర్ధ్యం, నేర్పు వాళ్ళకే, వారిలో జేఎన్టీయూవాళ్ళకి, అందులో మా క్లాసు సీఎస్‌ఈవారి సొంతమని నా గట్టి నమ్మకం)."


సారు చెప్పుతున్నంతసేపు ఆ అబ్బాయి నించోని వింటూ చూస్తున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు కలకత్తావెళ్ళి స్తంభాలులేని హౌరా బ్రిడ్జిచూసి నోరెళ్ళబెట్టివచ్చాడు. ఇంజినీరింగద్భుతం అనగానే అదే గుర్తొచ్చింది ఏం చేస్తాడు.

మొదటర్థంకాలా సారు తిడుతున్నాడా, పొగుడుతున్నాడాని. ఆ చివరివాక్యంతో అర్థమయిపోయింది.

ఇక క్లాసులో దృశ్యమేంటో, ఒక రెండుమూడు రోజులపాటు ఆ అబ్బాయికెంత టీజింగెదురయ్యిందో వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ అబ్బాయింకెవరో కాదు ఈ జేబి అంటే నేనేనని ఈపాటికి మీకు తెలిసిపోయుండాలే.

25, అక్టోబర్ 2010, సోమవారం

సుందోపసుందులు - ౩ : పోస్తానా? పొయ్యనా?

క్రిందటి భాగానికి కొనసాగింపు.

... పెళ్ళయిపోయింది, భోజనాలయిపోయాయి, అంటే వచ్చిన పనయిపోయింది. ఇప్పుడేం చేయాలి ఇంతరాత్రి - వెనక్కి పోవాలా? రాత్రికెక్కడుండాలి? అని ఆలోచించుస్తుంటే చల్లని కబురు చెప్పారు - మర్నాడు పొద్దున నాలుగున్నరకి మొదటి రైలుందీ, అయినా లాడ్జిలో రూము బుక్ చేశాము, హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అన్నారు. వాళ్ళ సంగతి తెలిసిందే అయినా, సరేనని బయలుదేరాం. మాకు వేరే ఛాయిస్ ఏముందిగనక.

మండపంనుండి బయలుదేరి రాత్రి పదకొండుకి ముచ్చట్లు (అదే సొల్లు) చెప్పుకుంటూ లాడ్జికి చేరాం. అక్కడ రెండు గదులు తీసుకున్నారట. ఒక గదిలో మీరు తాగుతారో, ఏం చేసుకుంటారో (వాళ్ళకి వేరే ఆలోచనలుకూడా వున్నట్లు సందేహమొచ్చింది) మీ ఇష్టంఅని, నేనూ, రాం, కిరణ్, ఇంకా శీను ఒకగదిలో దూరాం. గది చాలా దారుణంగా వున్నా, అలసిపోయున్నాంగా వెంటనే నిద్ర పట్టింది. ఇలా పడుకున్నామోలేదో వెంటనే మావాళ్ళు తలుపులుబాదటం మొదలుపెట్టారు. అరే, లాడ్జివాడు ఖాళీ చేయమంటున్నాడు, పదండిరా అని. అర్థమయిందేంటంటే వాళ్ళు పిచ్చగా తాగి గొడవ చేసిందిచాలక ఇంకో వెధవ పనిక్కూడా ప్రయత్నించారని. ఓనర్కి, వీళ్ళకి మాటామాటా పెరిగి, ఇంక ఊళ్ళో లాడ్జీలేలేవా అని మమ్మల్నీ బయటికి లాక్కొచ్చారు మమ్మల్ని ఓనరుతో మాట్లాడనీకుండా.

ఫుల్లుగా తాగి రోడ్డుపై గట్టిగా మాట్లాడుతూ ముందువాళ్ళు, కొంచెం దూరంలో వెనక మేము నలుగురం. ఏం చేస్తాం, వాళ్ళు లోకల్, మేం ఊరికి కొత్త. వాళ్ళు తిప్పే రోడ్లే అర్థంకావట్ల, ఇంక లాడ్జిలెక్కడో ఏం తెలుసు. ప్రతీ లాడ్జీలో లేదు అనిపించుక్మ్టూ (వీళ్ళని చూసి ఎవరిస్తారు), సగం నిద్రతో హూనమైన ఒళ్ళుతో కాళ్ళీడూస్తూ అలా అర్ఠరాత్రి గంటసేపు తాగుడు బ్యాచితో కాకినాడ ఊరేగాక, ’రక్షక్’లో పోలీసుమామలెదురయ్యారు. మావాళ్ళని కొంచెం గమ్మునుండమని, వారికేదో చెప్పి తప్పించుకున్నాం. ఆ దెబ్బకి ఇక నావల్ల కాదు, దీనికన్నా రైల్వేస్టేషను నయం, హాయిగా వెయిటింగురూములో కూర్చోవచ్చు, నేవెళ్తున్నా ఎవరైనా వస్తారా అనడిగా - రాం, కిరణ్, శీను బయలుదేరారు.

అలా ఒంటిగంటకి కాకినాడ స్టేషనుకి వెళ్ళితే అక్కడ అసలు షాకులు.

స్టేషను బాగుచేస్తున్నారంటా, మొత్తం గుంటలూ, గొట్టాలు. మొత్తం చిమ్మచీకటి. కనీసం రిక్షాలు, ఆటోలు కూడా లేవు. ఎలాగో తారాడుకుంటూ, స్టేషను బిల్డింగుకి చేరితే, బుకింగు కౌంటరు తప్ప అన్ని రూములు బందు రిపేర్లకి. ఓవర్ బ్రిడ్జీకి కంచెలు. సిమెంటు బెంచీలు మళ్ళీ కొత్తగా కట్టడంతో పచ్చిపచ్చిగా. ప్లాట్ఫామంతా సిమెంటూ, ఇసక. పట్టాలు దాటి రెండో ప్లాట్ఫాం చివరదాక నడుచుకుంటూ వెళ్ళితే అక్కడ ఒక్క బెంచీ దొరికింది. హమ్మయ్యా అని దానిపై సెటిలయ్యాం. చలీ, దోమలు తట్టుకుంటూ నెమ్మదిగా నిద్రపట్టుతుంది అనుకుంటుండగానే ఒక గూడ్సు రైలు పేద్ద శబ్దంతో పోర్టు స్టేషన్నిండి వచ్చి రెండో ప్లాట్ఫాంపై వచ్చి ఆగింది.

ఇంక మాకు టెన్షను. మరి ఫుట్‌బ్రిడ్జి మూసుందిగా. దానికింద నుండి దూరదాం అంటే అదెప్పుడు బయలుదేరుతుందో తెలీదు. ఇద్దరేమో దాని కింద నుండి దూరారు. నేనూ, శీను ఫుట్‌బ్రిడ్జీ కంచె దూకి పైకెక్కి మళ్ళీ ఇవతలి ప్లాట్ఫాంకి వచ్చాం. ఈ ఫీటులో శీను కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. కిరణ్దగ్గర ఒక దుప్పటి వుందని అప్పుడు గుర్తొస్తే దాన్ని పరిచి ఇద్దరు కూర్చున్నారు. నేను, ఇంకోడూ ప్లాట్ఫాంపై. ఉద్యోగంలో కొచ్చాక మొట్టమొదటిసారి రెండువేలు పెట్టి కొనుక్కున్న పీటర్ ఇంగ్లాండ్ జత - ఒక్కసారే వేసుకున్నా - అలా ప్లాట్ఫాంపై సిమెంటూ-ఇసకలతో. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆజత వేసుకున్నపుడల్లా బాధే.

అలా అర్థరాత్రి చిమ్మచీకటిలో, బ్రాండెడ్ దుస్తులతో మేము నలుగురం ఆ కాకినాడ ప్లాట్ఫాంపై పొర్లుతూ దోమలతో కుస్తీ పడుతూ జోగుతుంటే ప్లాట్ఫాంపై కలకలం మొదలయ్యింది. లేచి చూస్తే మూడున్నరయ్యింది. జనాలు వస్తున్నారు. మేం నెమ్మదిగా లేచి టిక్కెట్లు కొనుక్కొచ్చుకున్నాం. మర్చిపోయా, ఈ మధ్యలో, శీను ఈ బాధ భరించలేక బస్టాండుకి వెళ్ళిపోయాడు, హైదరాబాదుకి ఫస్టు బస్సులో పోతాని.

నాలుగున్నరకి రైలంటే నాలుగిరవైకి చూడాలి, ప్లాట్‌ఫాంపై కాలు పెట్టేచోటు కూడాలేదు. పోర్టు స్టేషన్నుండి రావాల్సిన రైలు ఐదయితేగానీ రాలేదు, మమ్మల్ని గంటసేపు నిల్చోబెడుతూ. ఏదో మాకిరణ్ రన్నింగులో రైలెక్కి సీట్లాపాడు కాబట్టి బతికిపోయాం. ఇక చూస్కోండి విజయవాడకి వచ్చేవరకు లేవకూడదని చెప్పి పడుకున్నాం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే నేను ఒక టపా ఎందుకు రాస్తాను. ఎనిమిదో, ఎనిమిదిన్నరకో రాజమండ్రిలో స్వామిజీ వేషంలో ఒకాయనెక్కాడు. నేను గోదావరిచూసి పడుకుందాంలే అని లేచా. మేం కూర్చున్న ఐదుసీట్ల చెక్కపై కూర్చున్నాడు. ఎదురుకూర్చున్న ఒకావిడని మీది ఫలాన ఊరు కదా, ఫలానఫలాన కదా అని మొదలుపెట్టాడు. ఆవిడకూడా మొహం వెలిగిపోయింది, భలే చెప్పారండీ, తమరు ఫలానావారింటికి వచ్చారుగదా అని ఆయన్ను గుర్తుపట్టింది. ఇక తన జ్యోతిషవిద్య చూపించడం మొదలుపెట్టాడు. నేను కళ్ళుమూస్తూ తెరుస్తూ గమనిస్తున్నా.

ఈ గురూజీ పక్కన ఒక పల్లెటూరి యువకుడు, పదహారుకన్నా వుండవు కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఇవన్నీ వింటూ, "గురూగారూ, మీరు జరగబోయేవన్నీ చెప్పగలరా? ఐతే నాకు ఏం జరుగుతుందో చెప్పండీ" అనడిగాడు.
ఆ గురూజీ అతన్ని తేరిపారజూసి నేను చెప్పినా నీకు వినగలిగే యోగ్యతలేదు నాయనా అన్నాడు. అతను "ఎందుకండీ? నేను ఇలా పల్లెటూరివాడిలా కనిపిస్తున్నా; మీకు డబ్బులివ్వలేను; ఆవిడయితే బాగా డబ్బులిస్తుందనేగా" అని అడిగాడు. గురూజీకి దబ్బున కోపమొచ్చింది. మాటామాటా పెరిగాయి. వాదించుకోవడం మొదలుపెట్టారు.

ఇక ఆ అబ్బాయికి సపోర్టుగా కొందరూ, ఈయనకి సపోర్టూగా కొందరు, వినోదంచూస్తూ మరికొందరు. మా రాంలా వారి ఊహాలోకాల్లో హాయిగా విహరిస్తూ కొందరు. నాలా, కిరణ్లా, నిద్ర చెడిపోయి తిట్టుకుంటూ అతి తక్కువమంది.

కాసేపట్కి కుర్రాడు ఆవేశంతో ఊగిపోతూ, "మీరన్ని చెప్పగలరు కదా? ఐతే నేనిప్పుడు ఉచ్చపోస్తానా పొయ్యనా చెప్పండి" అని సవాలు విసిరాడు"? ఎదురుకూర్చున్నావిడ ఇక తిట్లు(బూతులతో) మొదలుపెట్టిందీ - సచ్చినోడా! పెద్దాయన్ని పట్టుకుని ఏంటా మాటలు అని. ఆ పిల్లాడిని సపోర్టు చేసేవాళ్ళేమో, "తప్పేంటండీ? ఆయనకి అన్నీ తెలిస్తే చెప్పమనండీ, పోస్తాడో పొయ్యడో". కుర్రోడేమో "మీరు పోస్తావంటే, నేను పొయ్యను - మీరు పొయ్యనంటే నేనిప్పుడే వెళ్ళిపోస్తా" అని. ఆ గురూజీ ఏదో డొంకతిరుగుడు సమాధానాలివ్వడం, వీడు "అవన్నీ ఎందుకండీ? నేను పోస్తానా పొయ్యనా జెప్పండి" సూటిగా చెప్పండని.

ఈ దెబ్బకి మా రాం. బస్సులు ఏక్సిడెంట్లవుతున్నా చలించనివాడు, నిద్రలేచి, "ఏంట్రా, పోస్తానా పొయ్యనా అంటూన్నాడూ. ఏంటిరా ఈ గొడవ" అని ప్రశ్నలు మొదలుపెట్టాడు. వాడికి మొత్తంచెప్పా.

ఈ లెక్కన నూజివీడు దాటేవరకు గొడవజరుగుతూనే వుంది. ఇంక నిద్రెక్కడపోయేది. విజయవాడ స్టేషను బయట సిగ్నల్కోసమో, క్రాసింగుకోసమో గంటపైనే పడేశాడు. ఎదురు పెద్దావిడ చూసిచూసి, "గురువుగారితో గొడవకోసం నువ్వెందుకు ఆపుకుంటావు, వస్తేపోసిరావచ్చుగా" అనింది. నాకువచ్చినప్పుడే నాకు నచ్చినప్పుడే పోసివస్తా? అయినా ఈయన్ని చెప్పమనండీ, నేను నా జాతకం ప్రకారం ఇప్పుడుపోస్తానో, పొయ్యనో అని.

మాకు సహనం నశించీ, ఆకలితో కృశించీ నీరసంతో పడిపోయే దశకి చేరుకున్నాం. ఇంతలో రైల్వేవారు దయతలచి మమ్మల్ని నిజయవాడకి చేర్చగా, ఇంక ప్రయోగాలు చాలని అక్కడి నుండి డైరెక్టు బస్టాండుకి చేరి బస్సుపట్టుకొని మధ్యాహ్నం రెండిటికి గుంటూరులో ఎవరిళ్ళకి వారు చేరుకున్నాం.


ఇలా వుంటాయి మా ఆలోచనలూ-తెలివితేటలూ, వాటితో మా నిర్వాకాలు. అప్పుడప్పుడేలేండి ఏదో ఆవేశంతో, లేకపోతే మేము చాలా ఆర్గనైజ్డ్.